Telangana: తెలంగాణలో అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలు అమలు, రైతుభరోసా కింద తొలి విడతగా రూ. 6 వేలు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు
నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డుల పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లబ్దిదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు
Hyd, Jan 27: నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డుల పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లబ్దిదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలను అందజేస్తాం. అప్పటివరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున జనవరి 26 అర్ధరాత్రి నుంచే టకీటకీమని రైతుల ఖాతాల్లో పడతాయి..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు.
‘భూమికి విత్తనానికి మధ్య ఎలాంటి బంధముందో, రైతుకు కాంగ్రెస్కు మధ్య అలాంటి బలమైన అనుబంధముంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ప్రకటించారు. రూ.1,200 కోట్ల విద్యుత్ బకాయిలను ఒక్క కలం పోటుతో రద్దుచేశారు. నాటి ప్రధాని మన్మోహన్సింగ్..సోనియాగాంధీ నేతృత్వంలో రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపారు. ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తూ గత ఆగస్టు 15 నుంచి 25.50 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం..’అని సీఎం పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ పాలనలో 2004–2014 వరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించాం. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే వైఎస్సార్ గుర్తొస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కొడంగల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 36 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే కేసీఆర్కు కడుపుమండి సీబీ సీఐడీ విచారణ చేయించారు. కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏ ఊరిలోనైనా వచ్చాయా? పదేళ్ల కేసీఆర్ పాలనలో ఊరికో కోడి, ఇంటికో ఈక కూడా ఇవ్వలేదు.
మేం రానున్న నాలుగేళ్లలో ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 15 నుంచి 20 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తాం. కొడంగల్లో పరిశ్రమలు పెడతామంటే కేసీఆర్ మనుషులు అడ్డుపడుతున్నారు. అధికారులపై దాడులు చేయించి చంపాలని చూస్తారా? మా కొడంగల్ బిడ్డలు ఎప్పటికీ బస్టాండుల్లో లుంగీలు కట్టుకుని ఖాళీగా ఉండాలా? డాక్టర్లు, ఇంజనీర్లు కావద్దా?..’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
‘గత 13 నెలల్లో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఒక్కసారైనా శాసనసభకు వచ్చాడా? సర్పంచ్ కొన్నిరోజులు లేకపోతేనే ఊరు విడవమని అంటరు. అలాంటిది ఆయన్ను ఏమనాలి? ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత లేదా? అలాంటప్పుడు ఆ పదవి ఎందుకు? అధికారం ఉంటే కొల్లగొడతారు కానీ ప్రతిపక్ష బాధ్యత వద్దు. కేసీఆర్ మేధావినని, 80 వేల పుస్తకాలు చదివానని చెప్తడు. కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటడు. కానీ ప్రజలకు రేషన్కార్డులివ్వాలన్న జ్ఙానం లేదు. పదేళ్లలో ఒక్కరికీ రేషన్కార్డు ఇవ్వలేదు. ప్రాజెక్టులు పూర్తిచేయలేదు..’అని సీఎం విమర్శించారు.
ఏడాది రైతుభరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా రూ.12 వేలు ఇస్తామని పేర్కొన్నారు. రైతులకు యాసంగికి పెట్టుబడి సాయం, కూలీలకు రూ.6 వేలు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఖాతాల్లో పడతాయని వివరించారు. సోమవారం నుంచి బ్యాంకుల్లో నగదు తీసుకోవచ్చన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో ప్రజాపాలన గ్రామసభ ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. అందుకు రూ.21 వేల కోట్లు చెల్లించామని ప్రకటించారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని అన్నారు. అర్హులైన అందరికీ పథకాలు వస్తాయని స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇళ్లు మంజూరవుతాయని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు.
(The above story first appeared on LatestLY on Jan 27, 2025 05:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

