Telangana: హైదరాబాద్‌లో శాఫ్రాన్ రూ.1200 కోట్ల పెట్టుబడులు, 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు, హర్షం వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్
IT Minister kTR (Photo-Twitter)

Hyd, July 7: తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ రూ.1200 కోట్లతో తన కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైమానిక రంగానికి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఈ నిర్ణయంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ (Minister KT Rama Rao) హర్షం వ్యక్తం చేశారు.

ఏరోస్పేస్‌ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదని ఈ నిర్ణయంతో మరోసారి రుజువైందన్నారు. శాఫ్రాన్‌ సంస్థకు (French aviation giant Safran ) చెందిన అతిపెద్ద ఎమ్మార్వో కేంద్రం ఇదేనని, మన దేశంలో ఓ విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనని తెలిపారు. దీని ద్వారా దాదాపు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు ( Creating 1,000 jobs) లభిస్తాయన్నారు. వాణిజ్య విమానాల్లో ఉపయోగించే లీప్‌-1ఏ, లీప్‌-1బీ ఇంజిన్ల నిర్వహణకు ఏర్పాటు చేయనున్న శాఫ్రాన్‌ ఎమ్మార్వో కేంద్రంతో తెలంగాణలోని ఏవియేషన్‌ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.

ఈ జిల్లాల వాళ్లు బయటకు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి! తెలంగాణలో ఆరు జిల్లాలకు అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరిక, మీ జిల్లా ఉందో చెక్‌ చేసుకోండి!

ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ అంతర్జాతీయంగా హైటెక్నాలజీ గ్రూప్‌. ఇది వైమానిక, రక్షణ, అంతరిక్ష రంగాల్లో పనిచేస్తుంది. వైమానిక రంగానికి సంబంధించి ప్రొపల్షన్, ఎక్విప్‌మెంట్, ఇంటీరియర్స్‌ తయారీల్లో అగ్రశ్రేణి సంస్థ. గగనతల రవాణాకు సంబంధించి సురక్షితమైన, సౌకర్యవంతమైన సహకారాన్ని ప్రపంచానికి అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 2021 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం ఈ సంస్థ పరిధిలో 76,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 15.3 బిలియన్‌ యూరోల విక్రయాలతో ప్రపంచంలో అగ్రస్థానాన ఉంది. జీఈ సంస్థతో కలిసి వాణిజ్య జెట్‌ ఇంజన్లకు సంబంధించి ప్రపంచంలోనే నంబర్‌ 1గా ఉన్న శాఫ్రాన్‌.. హెలికాప్టర్‌ టర్బైన్‌ ఇంజన్లు, లాండింగ్‌ గేర్ల తయారీల్లో కూడా అగ్రశ్రేణి సంస్థగా ఉంది.

Covid in TS: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 552 మందికి కోవిడ్, హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదు 

ఇటీవల హైదరాబాద్‌లో శాఫ్రాన్‌ సంస్థ రెండు మెగా ఏరోస్పేస్‌ ప్రాజెక్టులను స్థాపించింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి శాఫ్రాన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ పవర్‌ ఫ్యాక్టరీ. ఇది విమాన ఇంజన్‌లకు వైర్‌ హార్నెస్‌లను ఉత్పత్తి చేస్తుంది. రెండోది శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్‌ ఫ్యాక్టరీ. ఇది కీలకమైన లీప్‌ ఇంజన్ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజన్‌ భాగాలను తయారు చేయనుంది.ఈ రెండు ఫ్యాక్టరీలను గురువారం మంత్రి కేటీఆర్‌.. శాఫ్రాన్‌ గ్రూప్‌ సీఈవో ఒలివీర్‌ ఆండ్రీస్, శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్‌ సీఈవో జీన్‌పాల్‌ అలరీలతో కలిసి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎంఆర్‌ఓకు ఇవి అదనం. ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ సంస్థల నుంచి మెగా పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో అత్యంత శక్తిమంతమైన ఏరోస్పేస్‌ వ్యాలీగా హైదరాబాద్‌ స్థిరపడనుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణలో ఇప్పటికే పలు దేశ, విదేశీ ఏరోస్పేస్‌ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటిలో బోయింగ్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, జీఈ ఏవియేషన్‌, శాఫ్రాన్‌, రాఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, ఎల్బిట్‌ సిస్టమ్స్‌ తదితర ప్రముఖ గ్లోబల్‌ ఏరోస్పేస్‌ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ (ఓఈఎం) సంస్థలు ఉన్నాయి. వీటితోపాటు ప్రముఖ దేశీయ ఏరోస్పేస్‌, రక్షణ రంగ సంస్థలైన టాటా, అదానీ, కల్యాణి గ్రూపులు తమ పరిశ్రమలను ఏర్పాటుచేసి, వివిధ రకాల పరికరాలను తయారు చేస్తున్నాయి.

హైదరాబాద్‌లోని టాటా బోయింగ్‌ కంపెనీ అపాచీ హెలికాప్టర్‌ ప్రధాన బాడీ (ఫ్యూజ్‌లేజ్‌)లను తయారు చేస్తున్నది. టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ 150వ సూపర్‌ హెర్క్యులస్‌ హెలికాప్టర్‌ సీ-130జే ఎంపన్నేజ్‌ (హెలికాప్టర్‌ వెనుక భాగంలోని ముఖ్యమైన భాగం)లతోపాటు ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ వింగ్స్‌ను రూపొందిస్తున్నది. వెమ్‌ టెక్నాలజీస్‌ మధ్య తరహా తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) ‘తేజాస్‌’ ఫ్యూజ్‌లేజ్‌ను తయారు చేస్తున్నది.స్పెయిన్‌కు చెందిన రోల్స్‌రాయిస్‌ గ్రూపు విమానాల ఇంజిన్ల తయారీకి సంబంధించిన ఐటీపీ (ఇండస్ట్రియా డీ టర్బో ప్రొపల్సర్స్‌) ఏరోను ఇటీవలే ప్రారంభించింది.

వెమ్‌ టెక్నాలజీస్‌ ఇటీవల రూ.1,000 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో సమీకృత రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టింది. రక్షణ శాఖకు ఉపయోగపడే ఏరో స్ట్రక్చర్స్‌, ఏరో ఇంజిన్స్‌, రాడార్‌ సిస్టమ్స్‌, హెలికాప్టర్లు, విమానాలకు అవసరమైన పరికరాలను ఇక్కడ రూపొందించనున్నారు. ఏరోస్పేస్‌, రక్షణ పరికరాల ఉత్పత్తికి నిపుణులైన ఉద్యోగులను అందించేందుకు హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌, రక్షణ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.