Telangana Health Bulletin: తెలంగాణలో కొత్తగా 186 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, టీకా పట్ల అపోహలు వద్దని ప్రముఖ వైద్య నిపుణుల భరోసా
Image of Gandhi Hospital, COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, January 30: తెలంగాణలో ప్రస్తుతం ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందికి కొవిడ్ నివారణ టీకాల పంపిణీ జరుగుతోంది. అయితే వ్యాక్సిన్ పట్ల కొందరిలో భయాలు ఉండటంతో ఎలాంటి సందేహాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని వైద్య నిపుణులు పిలుపునిస్తున్నారు. ఇందుకోసం పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్, ప్రైవేటు రంగంలో హెల్త్‌కేర్ వర్కర్స్ మరియు వివిధ సంఘాలకు చెందిన ఉన్నత వైద్యులతో సమావేశమై అభిప్రాయాలను పంచుకుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా టీకా అందుకున్నారని వారంతా ఆరోగ్యంగా ఉన్నారు, వ్యాక్సిన్ సంబంధిత మరణాలు ఏమి లేవు. రాష్ట్రంలో చూసిన రెండు మరణాలు యాదృచ్చికమైనవి కానీ, అవి వ్యాక్సిన్‌కు ప్రతిస్పందనగా కాదు అని పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ పేర్కొంది.

అయినప్పటికీ ప్రైవేట్ హెచ్‌సిడబ్ల్యుల నుంచి టీకా పట్ల నిరాసక్తత శుక్రవారం కూడా కొనసాగింది, రిజిస్టర్ చేసుకున్న వారిలో కేవలం 47 శాతం మాత్రమే టీకా తీసుకున్నారు. నిన్న 15,360 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ఇప్పటికీ కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది.  నిన్న రాత్రి 8 గంటల వరకు 33,088 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 186 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 920 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,94,306కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 34 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 12, మేడ్చల్ నుంచి 10, కరీంనగర్ నుంచి 11 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

 Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

అలాగే గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,598కు పెరిగింది. అలాగే,  శుక్రవారం సాయంత్రం వరకు మరో 367 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 290,354 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,354 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.