
Hyderabad, March 31: తెలంగాణలో కోవిడ్ విజృంభన కొనసాగుతోంది, రోజురోజుకి కేసులు పెరుగుతూపోతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 12 లక్షల మందికి టీకా పంపిణీ పూర్తి చేశారు. అలాగే రాష్ట్రంలో టెస్టింగ్, ట్రేసింగ్ మరియు ట్రీట్మెంట్ సామర్థ్యాన్ని కూడా ఆరోగ్యశాఖ మరింత పెంచింది.
రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 56,122 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 684 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 1392 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,07,889కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 184 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 61 కేసులు,నిజామాబాద్ నుంచి 48, రంగారెడ్డి 45 మరియు నిర్మల్ జిల్లా నుంచి 30 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,697కు పెరిగింది.
అలాగే మంగళవారం సాయంత్రం వరకు మరో 394 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,01,227 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,965 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయని కేంద్రం సంకేతాలిచ్చిన నేపథ్యంలో వయసుతో సంబంధం లేకుండా కోవిడ్ ముప్పు పొంచి ఉన్న వారందరికీ టీకా వేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. జనంతో ఎక్కువగా మమేకమయ్యే ఉద్యోగులు, వ్యాపారులు, జర్నలిస్టులు, ఆర్టీసీ మరియు ఇతర రవాణా సిబ్బంది మొదలగు వారికి టీకా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.