
Hyderabad, December 17: తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది, ఇటీవల కాలంగా ప్రతిరోజు 500-600 మధ్య కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండగా, అర్బన్ ఏరియాల్లో కూడా కేసులు ఎక్కువున్నాయి. ఇక మరోవైపు మధ్య జనవరి మాసం నుండి వ్యాక్సిన్ అందించే దిశగా ఆరోగ్యశాఖ అధికారులు పనులు స్పీడప్ చేశారు. అయితే తొలివిడతలో ఆరోగ్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ లభించనుంది.
కేసుల విషయానికి వస్తే, రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 48,652 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 509 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 717 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 63,06,397 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 279,644కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 104 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 45, రంగారెడ్డి నుంచి 42 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.


మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,505కు పెరిగింది.
అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 517 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 270,967 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,172 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.