Yadadri Power Plant: 2023 డిసెంబర్ నాటికి యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి చేయాలి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాలని జెన్కోకు సూచించిన సీఎం కేసీఆర్
2023, డిసెంబర్ చివరి నాటికి (to be ready by December 2023) యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి వెలుగులు పంచాలని జెన్కోకు సూచించారు. పనులను వేగవంతం చేయాలన్నారు.
Hyd, Nov 28: యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ (Yadadri power plant) నిర్మాణ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంకు వెళ్లిన సంగతి విదితమే. యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ (Telangana CM KCR) హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పనుల పురోగతిని పరిశీలించారు.
నిర్మాణ పనుల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫస్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయిలర్ నిర్మాణంలో 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్లో జరుగుతున్న పనులను సీఎం నిశితంగా పరిశీలించారు. ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 2023, డిసెంబర్ చివరి నాటికి (to be ready by December 2023) యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి వెలుగులు పంచాలని జెన్కోకు సూచించారు. పనులను వేగవంతం చేయాలన్నారు.
2015లో ఈ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. 5 వేల ఎకరాల్లో రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు దేశం కీర్తి ప్రతిష్ఠలు పెంచుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే దీని నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తొలుత ప్లాంట్ ఫేజ్-1లోని యూనిట్-2 బాయిలర్ నిర్మాణ పనులు పరిశీలించడానికి వెళ్లిన సీఎం.. 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్ చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం జరగుతున్న తీరుపై ట్రాన్స్కో, జన్కో, బీహెచ్ఈఎల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్ప్లాంట్కు సంబంధించి ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. విద్యుత్ కేంద్రంలో కనీసం 30 రోజులకి అవసరమయ్యే బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కీలకమైన విద్యుత్ ప్రాజెక్టు విషయంలో బొగ్గు నిల్వలు సహా, ఇతర నిర్వహణలో అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పవర్ ప్లాంట్కు ప్రతిరోజు బొగ్గు, నీరు ఎంత అవసరమవుతుందనే విషయంపై సీఎం ఆరా తీశారు. కృష్టా జలాలను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో పవర్ ప్లాంట్కు దామరచర్లను ఎంపిక చేసినట్టు తెలిపారు.
విద్యుత్ కేంద్రంలో పనిచేసే సుమారు 10వేల మందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్షిప్ నిర్మాణం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇక్కడే సౌరవిద్యుత్తు నిర్మాణం చేపడుతున్నందున పనిచేసే సిబ్బంది ఇంకా పెరిగే అవకాశం ఉందని.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది క్వార్టర్స్, ఇతరత్రా సదుపాయాల కోసం ప్రత్యేకంగా వంద ఎకరాలు సేకరించాలన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 50 ఎకరాలు కేటాయించాలన్న సీఎం.. ఇతర అవసరాలకు మరో 50 ఎకరాలు వినియోగించాలని చెప్పారు.
పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలు అందించే ప్రైవేట్ సర్వీసు ఉద్యోగులకు అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్ ప్లాంట్ వరకు సుమారు 7కి.మీ మేర నాలుగు వరసల రోడ్డు మంజూరు చేయాలని కార్యదర్శి స్మితా సబర్వాల్ను సీఎం ఆదేశించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
.
విద్యుత్ కేంద్రానికి భూమి ఇచ్చిన రైతులతోపాటు గతంలో సాగర్ ప్రాజెక్టుకు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తోపాటు జిల్లా కలెక్టర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను సేకరించడానికి ఎక్కువ సమయం కేటాయించిన సీఎం.. ఎక్కడికక్కడే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో రెండు యూనిట్స్ 2023 డిసెంబర్ వరకు.. మిగతావి 2024 జూన్లోపు పూర్తవుతాయని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సీఎంకు వివరించారు. పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరుపై సీఎండీ ప్రభాకర్రావును ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు.
(The above story first appeared on LatestLY on Nov 28, 2022 08:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

