AP Cabinet Expansion: వైసీపీలో పండగ వాతావరణం, కొత్తగా ఇద్దరు మంత్రులతో పాటు రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం, సీఎం పరిధిలో రెండు శాఖలు, గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy Expands Cabinet Inducts Two Ministers (Photo-AP CMO Twitter)

Amaravati, July 22: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొత్త మంత్రులుగా (New Ministers) సీదిరి అప్పలరాజు (Sidiri Appalaraju), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chellaboina venugopal krishna) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29 గంటలకు ఇద్దరు మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ (Biswabhusan Harichandan) ప్రమాణ స్వీకారం చేయించారు.  రాజ్యసభ చరిత్రలో తొలిసారి, సమావేశాలు జరగకుండా రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఏపీ నుంచి ముగ్గురు వైఎస్సార్ ‌సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు హాజరు అయ్యారు. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలో నేతలు హాజరు అయ్యారు.

కాగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్ (pilli subhash chandra bose), మోపిదేవి వెంకట రమణారావు (Mopidevi Venkataramana) రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక అవడంతో వారిరువురు మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది.

Here's AP CMO Tweet

అప్పలరాజు నేపథ్యం ఇదే: శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలరాజు 2019లో తొలిసారిగా పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి అప్పలరాజుకు అవకాశం కల్పిస్తున్నారు. వైద్య వృత్తిలో ఉంటూ 2017లో వైఎస్సార్‌సీపీ ఆహ్వానం మేరకు రాజకీయ అరంగేట్రం చేశారు. 2019 ఎన్నికల్లో సిట్టింగ్‌ సీనియర్‌ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషపై 16,247 ఓట్ల ఆధిక్యంతో తొలి పర్యాయంలోనే రికార్డు విక్టరీసాధించారు. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో మత్స్యకార కుటుంబంలో సీదిరి అప్పలరాజు జన్మించారు. వైసీపీలో కరోనా కలకలం, సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతల ట్వీట్‌లు

సొంతగ్రామంలో ఎంపీయూపీ స్కూల్‌ 1నుంచి 7వ తరగతి వరకు, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు సింహాచలం(అడివి వరం స్కూల్‌) గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. పదో తరగతిలో స్టేట్‌ నాలు గో ర్యాంకు సాధించారు. గాజువాక మార్గదర్శి ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసి, ఓపెన్‌ కేటగిరిలో ఎంబీబీఎస్‌ సీటు సాధించారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వెంటనే ఎంట్రన్స్‌ పరీక్షలో పాసై కేజీహెచ్‌లో ఓపెన్‌ కేటగిరిలో పీజీ సీటు సాధించారు. ఎండీ జనరల్‌ మెడిసిన్‌ చేసి పదేళ్లకు పైగా పలాసలో వైద్య సేవలందించారు.

చెల్లుబోయిన వేణు నేపథ్యం: అలాగే శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి తూర్పు గోదావరికి చెందిన చెల్లుబోయిన వేణుకు పదవి దక్కింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ మంచి క్రీడా నేపధ్యం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. క్విక్ బాక్సర్ గా ఉన్న వేణు విద్యావంతుడు బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో దివంగత జక్కంపూడి రామ్మోహన రావు తొలిగా రాజకీయాల్లో ప్రోత్సహించారు. చెల్లుబోయిన వేణుగోపాల్ ను స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి పరిచయం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా పరిషత్తు చైర్మన్ కావడంలో క్రీయాశీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఆ పదవిలో రాణించారు.

కాగా చెల్లుబోయిన వేణుగోపాల్ కాకినాడ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కి తొలి నుంచి మంచి మిత్రుడు. అదేవిధంగా జగన్ వైసిపి స్థాపించిన నాటినుంచి ఆయన వెంటే నడిచారు. ఈ నేపధ్యమే చెల్లుబోయిన వేణుగోపాల్ కి 2019 లో రామచంద్రపురం ఎమ్యెల్యే టికెట్ వైసిపి నుంచి వచ్చేలా చేసింది. చెల్లుబోయిన వేణుగోపాల్ కోసం జగన్ తమ కుటుంబాన్ని నమ్ముకున్న పిల్లి సుభాష్ చంద్ర బోస్ ను మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అక్కడ బోస్ ఓటమి చెందినా ఎమ్యెల్సీ ని చేసి మంత్రిని చేసి తాజాగా రాజ్యసభకు పంపించారు. అలా బోస్ కి ఉన్నత స్థానం కల్పించడంతో బాటు వివాదరహితుడిగా పేరున్న చెల్లుబోయిన వేణుగోపాల్ కి క్యాబినెట్ లోకి ఆహ్వానించడం విశేషం.

సీఎం చేతిలో ఆ రెండు శాఖలు

రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి పదవికి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, అలాగే పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి పదవికి మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో వారి పదవులకు రాజీనామాలు చేయడంతో ఆ రెండు శాఖలు సీఎం పరిధిలోకి వెళ్లినట్లు సీఎస్‌ నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మంత్రులిద్దరి రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో వాటిని నోటిఫై చేస్తూ మరో ఉత్తర్వులు ఇచ్చారు.

అభినందనలు తెలిపిన జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మీడియా పాయింట్‌ వద్ద పుష్ప గుచ్ఛాలతో కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు.

ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా మరో సభ్యుడు పరిమళ్‌ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

ఈ సందర్భంగా ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన మాకు రాజ్యసభలో చోటు కల్పించడం అరుదైన సన్నివేశం. కలలో కూడా ఊహించనిది జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.మా అందరిపైనా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. విభజన చట్టం లో హామీలు ఇంకా పరిపూర్ణంగా అమలు కాలేదు .విభజన చట్టం అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం.

బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆంధప్రదేశ్‌లో రూ.40 వేల కోట్లు పైగా ఖర్చు పెట్టడం ఆల్‌టైమ్‌ రికార్డు. వ్యవసాయ రంగానికి రూ.19 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. విద్యా, వైద్య రంగాల మీద పెట్టిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా సీఎం వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాల హృదయంతో ఏపీని ఆదుకోవాలి’ అని పేర్కొన్నారు.

ఎంపీ మోపిదేవి  వెంకట రమణ

ఈ సంధర్భంగా మోపిదేవి మాట్లాడుతూ.. ‘ఇది మా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. ఇద్దరు బీసీలకు రాజ్యసభ చోటు కల్పించడం అరుదైన విషయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా కర్తవ్యమని తెలిపారు.

ఎంపీగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

తమపై నమ్మకం ఉంచి రాజ్యసభకు పంపిన సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయాన్ని నిలబెడతామని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి అనుగుణంగా పని చేస్తామని అన్నారు. ఆంధప్రదేశ్‌లో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సేవా రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టామని తెలిపారు. కేంద్రం పాలసీలను రాష్ట్రానికి అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలు

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను నామినేట్‌ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తాము రుణపడి ఉంటామని అమలాపురం మాజీ ఎంపీ డాక్టర్‌ పండుల రవీంద్రబాబు, మైనార్టీ మహిళా నేత ఎం.జకియా ఖానమ్‌లు పేర్కొన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.