
Amaravati, Feb 16: ఏపీలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది.బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana resign to bjp) రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda)కు కన్నా రాజీనామా లేఖను పంపారు. అనుచరులతో కలిసి బీజేపీ (BJP)కి కన్నా మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
ముందుగా గుంటూరులో ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించారు.కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర బీజేపీలో పరిణామాలు కలచివేస్తున్నాయన్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ పరిస్థితులు మారాయి. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా తెలిపారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు కన్నా వెల్లడించారు.
కాగా, గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. సోము వల్లే పార్టీ ఎదగడం లేదని విమర్శించారు. తన వర్గానికి చెందినవారికి పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని గతంలో కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే కన్నా టీడీపీలో కానీ జనసేన పార్టీలోకి కానీ వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏ పార్టీలో చేరేది మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్ని అనుచరులు చెబుతున్నారు. ఇటీవల కన్నా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సోమవారం అమరావతిలో జరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పర్యటనలో కూడా కన్నా పాల్గొనలేదు.