
Amaravati, June 26: ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 96,121 మంది నమూనాలు పరీక్షించగా 4,147 కేసులు (Covid in Andhra pradesh) నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 5,773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 46,126 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,75,622కి చేరగా, కరోనాతో 12,566 మంది మృతి (Covid Deaths) చెందారు.
18,16,930 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో 24 గంటల్లో 96,121 కరోనా టెస్టుల నిర్వహించారు. కరోనాతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగు రు చొప్పున, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపురం, కడప, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, విజయనగరంలో ఒకరు మృతి చెందారు.
ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలు, వైద్య పరికరాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై శ్రద్ధ పెట్టాలని, వీటిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. కోవిడ్–19 నియంత్రణ, చికిత్స, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల్లో వసతులపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ కోసం పటిష్ట యంత్రాంగం ఉండాలన్నారు. ప్రభుత్వ, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్వో ప్రమాణాలున్న మందులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 21 రోజుల్లో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, 104, 108 బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని, రోగులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కొత్తగా వస్తున్న 16 మెడికల్ కాలేజీలు, ఆధునీకరిస్తున్న 11 పాత వైద్య కళాశాలలు, హెల్త్ హబ్స్తో ఆరోగ్య రంగం మరింత బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హెల్త్ హబ్స్కు స్థలాలు.. ఆవాసాలకు దగ్గరగానే ఉండేలా చూడాలన్నారు. అప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని చెప్పారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా హెల్త్ హబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు.