AP SEC Petiton Row: రెండు చోట్ల ఇళ్లు ఎందుకు? ప్రజాధనాన్ని వృథా చేయడమే కదా? నిమ్మగడ్డ పిటిషన్ సంధర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు
ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు సరిగా సహకరించడం లేదంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్ (AP SEC Petiton Row) ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.. ఈ పిటిషన్ విచారణ సంధర్భంగా ధర్మాసనం (AP High Court) కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు హైదరాబాద్లో అధికార నివాసం ఎందుకని ఆయన విధులు నిర్వర్తించాల్సింది ఎక్కడ నుంచని ధర్మాసనం ప్రశ్నించింది.
Amaravati, Oct 23: ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు సరిగా సహకరించడం లేదంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ (AP SEC Petiton Row) ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.. ఈ పిటిషన్ విచారణ సంధర్భంగా ధర్మాసనం (AP High Court) కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు హైదరాబాద్లో అధికార నివాసం ఎందుకని ఆయన విధులు నిర్వర్తించాల్సింది ఎక్కడ నుంచని ధర్మాసనం ప్రశ్నించింది. అక్కడొక అధికార నివాసం, ఇక్కడొక అధికార నివాసం అంటే అందుకు ఎంత ఖర్చవుతున్నట్లు?.. ఆ డబ్బంతా ప్రజలదేనని.. మనమంతా పన్నుల రూపంలో చెల్లించే డబ్బే అంతిమంగా ఇలా దుర్వినియోగం అవుతోందని ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
కాగా ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు ఆర్థిక, ఆర్థికేతర సహాయ, సహకారాలు అందించేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని (AP Govt) ఆదేశించాలంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ (state election commissioner Nimmagadda ramesh kumar) దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంపై హైకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహాయ, సహకారాలపై అనుబంధ అఫిడవిట్ను దాఖలు చేసిన నిమ్మగడ్డ అందులో ప్రధానంగా నిధుల గురించే ప్రస్తావించారు. న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజులు పెద్ద మొత్తంలో బకాయి ఉన్నాయని వెల్లడించారు. ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు.
అనుబంధ వ్యాజ్యంపై తాజా విచారణ సందర్భంగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది డీవీ సీతారామమూర్తి ..ఎన్నికల కమిషన్ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని ప్రస్తావించారు. ఆర్థికేతర సాయం ప్రభుత్వం నుంచి అందడం లేదని కోర్టుకు తెలిపారు. దీనికి న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ స్పందిస్తూ.. సహాయ, సహకారాల కోసం పిటిషన్ వేసి, ఈ కేసుల గురించి ఎందుకు చెబుతున్నారని, ఈ వ్యాజ్యంలో అవి అవసరమా? అని ప్రశ్నించారు. దీంతో పాటుగా ఆర్థికేతర సాయం అంటే ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించడంతో సిబ్బంది ఖాళీల భర్తీ అని సీతారామమూర్తి పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కావాలా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనుమతి అవసరమని, ఖాళీలను ప్రత్యక్ష పద్ధతిలో లేదా, డిప్యుటేషన్లో భర్తీ చేయవచ్చని సీతారామమూర్తి తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరారని న్యాయమూర్తి ప్రశ్నించడంతో సీతారామమూర్తి జవాబు చెప్పలేకపోయారు.
పిటిషన్ విచారణ సందర్భంగా పిటిషన్తోపాటు జత చేసిన పలు బిల్లులను పరిశీలించిన న్యాయమూర్తి అవన్నీ ఏమిటని ప్రశ్నించారు. అవి న్యాయవాదులకు చెల్లించాల్సిన బిల్లులని సీతారామమూర్తి పేర్కొనగా, అలా అయితే నిన్న ప్రభుత్వం విడుదల చేసిన రూ.39 లక్షలు ఈ బిల్లులు చెల్లించేందుకు అయిపోతాయని న్యాయమూర్తి సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఈ డబ్బంతా ప్రజలదే. ఎంతోమంది పన్నుల రూపంలో చెల్లించిన డబ్బు ఇలా న్యాయవాదుల ఫీజులకు వెళుతుంది.. చాలా బాగుంది..’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సీతారామమూర్తి కేసుల గురించి చెప్పేందుకు ప్రయత్నించడంతో.., కేసుల గురించి అవసరం లేదని, సహాయ, సహకారాల అంశానికే పరిమితం కావాలని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
ఇక ఏపీ ప్రభుతవం తరపున న్యాయవాది సుమన్ తన వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషన్కు ఏ రకమైన సహకారం కావాలో ప్రభుత్వాన్ని ఎన్నడూ కోరలేదని ఆయన హైకోర్టుకు నివేదించారు. సిబ్బంది ఖాళీల భర్తీ విషయాన్ని కమిషనర్ ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదన్నారు. రూ.40 లక్షలు అడిగితే ఇచ్చేశామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ ఏడాది జనవరి 21న రూ.95 కోట్లు ఇచ్చామని, గత ఏడాది జూన్లో రూ.9.52 కోట్లు ఇచ్చామని, ఇలా వివిధ సందర్భాల్లో ఎన్నికల నిర్వహణకు రూ.117 కోట్లు ఇచ్చామని సుమన్ తెలిపారు.
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైదరాబాద్, విజయవాడలో అధికార నివాసాలు ఉండటంపై జస్టిస్ దేవానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు చోట్ల నివాసం ఎందుకని.. ఇదంతా ప్రజాధనమని న్యాయమూర్లి గుర్తు చేశారు. పన్నుల రూపంలో చెల్లించిన డబ్బంతా ఇలా దుర్వినియోగం అవుతోందని, అంతిమంగా ప్రజలే పరాజితులని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయవాదులకు ఎన్నికల కమిషన్ చెల్లించాల్సిన ఫీజు రూ.5.61 కోట్లు ఉందని, ఇదంతా పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న డబ్బని, ఆ డబ్బును ఇలా ఖర్చు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
(The above story first appeared on LatestLY on Oct 23, 2020 08:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

