AP Panchayat Election 2021: మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఏకగ్రీవాలు, విచారణ జరపాలని ఎస్ఈసీని ఆదేశించిన హైకోర్టు, ఏపీలో ముగిసిన పోలింగ్, మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం దక్కనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ పక్రియ మొదలవ్వనుంది.
Amaravati, Feb 13: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. 2,786 పంచాయతీలు, 20,817 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటికే 539 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.
పంచాయతీ ఎన్నికల ( AP Panchayat Election 2021) పోలింగ్ శాతం క్రమేసీ పెరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్ నమోదయిందన్నారు. 9 వేల పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో స్వల్ప సమస్యలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు.
రెండో దశలో 13 జిల్లాల్లో, 18 రెవెన్యూ డివిజన్లలోని 167 మండలాల్లో 3,328 పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 33,570 వార్డు సభ్యులకు గాను నోటిఫికేషన్ జారీచేయగా... 539 సర్పంచ్లు, 12604 వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో సర్పంచ్ స్థానం చొప్పున మొత్తం మూడు చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.
అలాగే 149 చోట్ల వార్డు సభ్యులకు ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. దీంతో ఏకగ్రీవాలు పోను 2,786 సర్పంచ్లకు, 20,817 వార్డు సభ్యులకు ఎన్నికలు ( AP Panchayat Election 2021 Phase 2 Polling) జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 44,876 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
12.30 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం
శ్రీకాకుళం జిల్లా- 51.30 శాతం
విజయనగరం జిల్లా- 71.5 శాతం
విశాఖ జిల్లా- 64.28 శాతం
తూర్పుగోదావరి- 60.90 శాతం
పశ్చిమగోదావరి- 63.54 శాతం
కృష్ణా జిల్లా- 66.64 శాతం
గుంటూరు జిల్లా- 69.08 శాతం
ప్రకాశం జిల్లా- 65.15 శాతం
నెల్లూరు జిల్లా- 59.92 శాతం
చిత్తూరు జిల్లా-67.20 శాతం
వైఎస్సార్ జిల్లా- 64.28 శాతం
కర్నూలు జిల్లా- 69.61 శాతం
అనంతపురం జిల్లా- 70.32 శాతం
ఇదిలా ఉంటే పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాల ఏకగ్రీవాలపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఏకగ్రీవాలపై విచారణ జరపాలని రేపటిలోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లెతోపాటు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నా.. నిలువరించడంలో ఎస్ఈసీ, జిల్లా కలెక్టర్ విఫలమయ్యారని పేర్కొంటూ పుంగనూరు ని యోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అనీషారెడ్డి, టీడీపీ మాజీ ఎ మ్మెల్యే శంకర్, న్యాయవాది పారా కిషోర్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై న్యాయస్థానం విచారించింది. బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు ఎస్ఈసీ పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా మాచర్ల నియోజకవర్గంలోని 77 గ్రామాలకు గాను 73 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏకగ్రీవాలైన నియోజకవర్గంగా మాచర్ల ముందంజలో ఉంది. గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మాచర్లలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది.
దీంతో పాటు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో రెండు పంచాయతీలు మినహా అన్నీ ఏకగ్రీవమయ్యాయి. పెద్దిరెడ్డి స్వస్థలం సదుంలో 18 పంచాయతీలు, 172 వార్డులను ఏకగ్రీవమయ్యాయి. పుంగనూరు మండలంలో 23, చౌడేపల్లి మండలంలో 17 ఏకగ్రీవమయ్యాయి. అయితే ఈ ఏకగ్రీవాలన్నీ బలవంతపు ఏకగ్రీవాలంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
(The above story first appeared on LatestLY on Feb 13, 2021 04:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

