Andhra Pradesh: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు, పీఆర్సీ బిల్లులు చెయ్యని అధికారులకు మెమోలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్ జారీ
కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని మంత్రి బొత్స (Minister Botsa Satyanarayana) పేర్కొన్నారు. పీఆర్సీ ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందని మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Amaravati, Jan 31: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని మంత్రి బొత్స (Minister Botsa Satyanarayana) పేర్కొన్నారు. పీఆర్సీ ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందని మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సమస్యలపై చర్చకు ఉద్యోగులను ఆహ్వానించామని, అయినప్పటికీ ఉద్యోగులు (AP Govt Employees) రాలేదన్నారు. మూడు రోజులు ఎదురు చూసినా ఉద్యోగులు రాలేదని, వాళ్లు రాకుండా ద్వితీయ శ్రేణి వాళ్లను పంపారని చెప్పారు.
ఉద్యోగులందరూ ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల కోసమే సీఎం కమిటీ వేశారని మంత్రి బొత్స తెలిపారు. ఉద్యోగులు ఏ కోరిక కోరినా సమంజసంగా ఉండాలన్నారు. రాష్ట్ర పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించకుండా నిరసన ( AP Govt Employees protest) చేస్తూనే జీతాలు ఇవ్వమంటున్నారని, తాము ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. మాట తూలితే దానికి సంఘ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే పీఆర్సీ బిల్లులు (PRC Bills) చెయ్యని అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. మొత్తంగా 27 మందికి మెమోలు జారీ కాగా.. అందులో ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు ఏటీఓలు ఉన్నారు. జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ అధికారులు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం సంతకం చేశారు. కాగా ఇటీవల ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిని మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్కు పంపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు.
(The above story first appeared on LatestLY on Jan 31, 2022 04:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

