Telangana: తెలంగాణలో 1100 దాటిన కోవిడ్-19 కేసులు, కొత్తగా మరో 11 పాజిటివ్ కేసులు నమోదు, హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
CM KCR & Health Minister Etala Rajender | File Photo

Hyderabad, May 6: తెలంగాణలో బుధవారం కొత్తగా మరో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య సోమవారం 1107కు చేరింది. అయితే ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే వచ్చినవి. జిల్లాల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా చాలా జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న పాజిటివ్ కేసులు కూడా జీరోకు చేరుకుంటున్నట్లుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ గణాంకాల ప్రకారం తెలుస్తోంది.

బుధవారం మరో 20 మంది కోవిడ్-19 పేషెంట్లు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 648 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. గత రెండు, మూడు రోజులుగా కొత్తగా కరోనా మరణాలేమి నమోదు కాలేదు, దీంతో మరణాల సంఖ్య 29 గానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 430 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.   కరోనాతో కలిసి జీవించాల్సిందే; సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్ 

Here's the Media Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

 

హైదరాబాద్‌ను రౌండ్ అప్ చేసి, వైరస్‌ను నిర్మూలించండి: సీఎం కేసీఆర్

 

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులో గల గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ “హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టీ అధికారులు హైదరాబాద్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలి. ఎవరు పాజిటివ్ గా తేలినా అతను కలిసిన వారందరినీ క్వారంటైన్ చేయాలి. హైదరాబాద్ లోని వారు బయటకు పోకుండా, బయటివారు హైదరాబాద్ లోనికి రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలి. చురుకైన పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఎఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలి, మొత్తం హైదరాబాద్ ను చుట్టుముట్టి, వైరస్ ను తుదముట్టించాలి” అని కేసీఆర్ దిశానిర్ధేషం చేశారు.

“పక్క రాష్ట్రంలోని కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వాటికి సరిహద్దుల్లోనే తెలంగాణ గ్రామాలున్నాయి. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. అటువారెవరు ఇటు రాకుండా, ఇటువారెవరు అటు పోకుండా నియంత్రించాలి. వైరస్ మన దగ్గర పుట్టింది కాదు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందేదే. కాబట్టి ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.