TSRTC: తెలంగాణలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే సర్వీసులు, నగర శివార్ల నుంచే జిల్లాలకు, MGBSకు వచ్చే బస్సులకు నో ఎంట్రీ, సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత పూర్తి క్లారిటీ
RTC Ready To Run Buses From Tomorrow In Telangana cabinet-meeting-begins-at-pragathi-bhavan| file Photo

Hyderabad, May 18: లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో​చిక్కుకుపోయిన వారికి తెలంగాణ సర్కార్‌ (Telangana Govt) శుభవార్తను అందించనుంది. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు (TSRTC) నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మంగళవారం నుంచి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.  భౌతికదూరం పాటిస్తూ 50శాతం సీటింగ్ తో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో 1551కి పెరిగిన కోవిడ్-19 కేసులు, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఆకస్మిక భేటీ, లాక్‌డౌన్ 4.0 తాజా మార్గదర్శకాలపై చర్చ

కాగా అన్ని జిల్లాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో బస్సులు తిరగనున్నాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, అంతరాష్ట్ర సర్వీసులకు మాత్రం ఇప్పట్లో అనుమతి లేనట్లుగానే తెలుస్తోంది. కేబినెట్ భేటీ తర్వాత ఆర్టీసీ సర్వీసులపై సీఎం కేసీఆర్ (CM KCR) అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ప్రయాణికుల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతి బస్సులో శానిటైజర్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్ పూర్తైన తర్వాతే విధుల్లోకి తీసుకోనున్నారు.  కేబినెట్‌ భేటీలో ప్రభుత్వానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ నివేదిక ఇచ్చారని సమాచారం. ఏపీలో రవాణాకు బస్సులు సిద్ధం, ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపిన రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీలో 2,282కి చేరిన కోవిడ్ 19 కేసులు

మరోవైపు ఛార్జీలు పెంచే అంశంపై కూడా మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో అంతరాష్ట్ర సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం లేనట్లే తెలుస్తోంది. బస్సు చార్జీలు, రూట్ల అనుమతి వంటి అంశాలపై మంత్రిమండలి సమావేశం అనంతరం పూర్తి వివరాలను తెలియనున్నాయి. లాక్డౌన్ 4 మార్గదర్శకాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులను జేబీఎస్‌ వరకే అనుమతించనున్నారు. వరంగల్‌ వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుంచి, నల్గొండ వెళ్లే బస్సులు ఎల్బీనగర్‌ నుంచి అలాగే మహబూబ్‌నగర్‌ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్‌ నుంచి ప్రయాణించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

లాక్ డౌన్ 4లో (Lockdown 4.0) కేంద్రం ఇచ్చిన సడలింపులతో అన్ని కార్యాలయాలు దాదాపుగా తెరుచుకున్నాయి. దీంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురి కాకుండా ఆర్టీసీ తగు చర్యలు చేపట్టనుంది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిపే బస్సుల్లో పరిమితంగా ప్రమాణీకులను అనుమతిస్తారు. దాంతో పాటు వ్యక్తిగత దూరం పాటించేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేశారు.

లాక్ డౌన్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రజారవాణా అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల పరస్పరం ఒప్పందం మేరకు బస్సులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నడపొచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం ఇచ్చిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.