YS Sharmila Praja prasthanam: చేవెళ్ల నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం, 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు, 16 సెగ్మెంట్లను చుట్టేలా పాదయాత్ర, తరలి రానున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు
తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిలా రెడ్డి 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర (Praja prasthanam foot march) చేపట్టి తిరిగి చేవెళ్లలోనే ముగించనున్నారు
Hyd, Oct 20: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం (YS Sharmila Praja prasthanam) మహా పాదయాత్ర బుధవారం చేవెళ్ల నుంచి ప్రారంభించారు. 2003లో దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 2012లో షర్మిల (Yeduguri Sandinti Sharmila) ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించారు. 230 రోజుల పాటు 116 నియోజక వర్గాల్లో 3112 కిలోమీట్లర్లు సుదీర్ఘ పాదయాత్ర చేశారు.
ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిలా రెడ్డి 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర (Praja prasthanam foot march) చేపట్టి తిరిగి చేవెళ్లలోనే ముగించనున్నారు. ఈ ఏడాది జూలై 8న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పాదయాత్ర చేపడతానని షర్మిల ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్ర హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా ప్రణాళికలు రచించారు. తొలి రోజు కార్యక్రమాలకు సీపీఐ నాయకులు, ప్రజా సంఘాల నేతలు హాజరుకానున్నారు.
మొదటి పదిరోజులు చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో యాత్ర సాగనుంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను చుట్టివచ్చేలా పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 26 సమన్వయ కమిటీలు ఈ పాదయాత్ర కోసం పనిచేస్తున్నాయి. అన్ని మండలాల్లోని మున్సిపాలిటీలు, గ్రామాల మీదుగా యాత్ర సాగుతుందని పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి తెలిపారు. నిత్యం సగటును రోజుకు 12 కిమిలు నడిచేలా షెడ్యూల్ రూపొందించినట్లు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రం అంతటా పాదయాత్ర చేపట్టనున్నట్లు షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే ద్యేయంగా పనిచేస్తానని ఆమె స్పష్టంచేశారు. వైయస్ సంక్షేమ పాలన అంటే రైతులకు విద్యుత్, జలయజ్ఞం, రుణమాఫి లాంటివి అమలు చేయడమని తెలిపారు. మహిళలు సొంతకాళ్లపై నిలబడి లక్షాధికారులు కావడం తమ పార్టీ లక్ష్యమని షర్మిల తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమని.. ప్రెయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని తెలిపారు.
ఇవన్నీ వైయస్ సంక్షేమ పథకాలని ఆమె తెలిపారు. అలాంటి పాలన ఇప్పుడు తెలంగాణలో లేదని.. వైఎస్ పాలన కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తామని షర్మిల తెలిపారు. ప్రజలందరూ ఈ పాదయాత్రకు తోడ్పాటునందించాలని వైఎస్ షర్మిల కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాత్ర సాగనుంది. తొలిరోజు చేవెళ్లలో సుమారు లక్ష మంది పాల్గొనేలా అన్ని జిల్లాల నుంచి జన సమీకరణకు పార్టీ ప్రతినిధులు ప్రణాళికలు రూపొందించారు.
పాదయాత్ర చేస్తున్నప్పటికీ... ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష యథావిధిగా కొనసాగించనున్నారు. ఎక్కడ పాదయాత్రలో ఉంటే అక్కడే దీక్షను కొనసాగిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి.
(The above story first appeared on LatestLY on Oct 20, 2021 12:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

