Heatwave Hits Telugu States: బయటకు రాకండి..వస్తే మాడిపోతారు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఎండలు, మే నెల రాకముందే మొదలైన వడగాడ్పులు, మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ
తెలుగు రాష్ట్రాలను వేడి గాలులు వణికిస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు వేడిగాలులు (Heatwave Hits Telugu states) వీస్తాయని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరికలు జారీ చేశాయి. ఏపీలో ఈసారి వేసవి తీవ్రంగా ఉండనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.
Hyderabad, Mar 31: తెలుగు రాష్ట్రాలను వేడి గాలులు వణికిస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు వేడిగాలులు (Heatwave Hits Telugu states) వీస్తాయని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరికలు జారీ చేశాయి. ఏపీలో ఈసారి వేసవి తీవ్రంగా ఉండనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇంకా మే నెల రాకముందే వడగాడ్పులు (Heatwave across Telangana and Andhra) మొదలయ్యాయి. ఏపీలో దక్షిణ కోస్తా తీరం వెంబడి రాబోయే మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ (Indian Meteorology Department (IMD) వెల్లడించింది.
ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వివరించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపైనా వడగాడ్పుల ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంద్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
పశ్చిమదిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో ఏపీలో హీట్ (Andhra pradesh Heatwave) పెరిగిపోతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో 45 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం దిశగా భూ ఉపరితలం నుంచి గాలులు వీయడంతో దక్షిణ కోస్తా, రాయసీమలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ప్రభావంతో అల్పపీడనం దిశగా గాలులు ఎక్కువగా వీచి ఎండల ప్రభావం ఎక్కువవుతుందని తెలిపారు.
అటు, తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రాష్ట్రంలో ఉత్తర దిక్కు నుంచి వేడిగాలులు (Telangana Heatwave) వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో వడగాడ్పులు తప్పవని, ఈ మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు ఇళ్లలో ఉండడం శ్రేయస్కరం అని, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అధిక వేడిమి ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో వీలైనంత వరకు బయటికి రావొద్దని పేర్కొంది.
తెలంగాణలో మార్చి 31, ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఎండలు అత్యంత ఎక్కువగా ఉంటాని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. రాజస్థాన్ ఎండారి నుంచి వేడి గాలులు ప్రభావంతొ తెలంగాణలో ఎండలు ఎక్కువవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు రాత్రిళ్లు కూడా వేడి తగ్గట్లేదు. ఏప్రిల్లో మధ్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు ఉండబోతున్నాయని అధికారులు అంచనా వేశారు. తెలంగాణలోని 24 జిల్లాల్లో ఎండలు పెరుగుతాయని చెప్పారు.
మినిమం ఉష్ణోగ్రత 20 నుంచి 27 డిగ్రీల సెల్సియస్గా మాగ్జిమం ఉష్ణోగ్రత 38 నుంచి 43 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని చెప్పారు. ఎండల ప్రభావంతో రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ తెలంగాణలో ఈ ఏడాది 8 నుంచి 9 నెలల పాటు కరువు ప్రభావం ఉంటుందని రాష్ట్ర వడగాల్పుల ప్రణాళిక (హీట్వేవ్ రిపోర్ట్) నివేదిక స్పష్టం చేసింది. వర్షాకాలంలో మూడు నుంచి నాలుగు నెలల మినహాయిస్తే.. మిగిలిన కాలంలో పొడి వాతావరణంతో నీటి కష్టాలు ఉంటాయని, ఇది వ్యవసాయంపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు.
అదే విధంగా రాష్ట్రంలోని మరో ఐదు జిల్లాల్లో వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగతాయని, ఈ ఏడాది మే నెలలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, దీంతో వడదెబ్బ మరణాలు పెరిగే ఛాన్స్ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో 589 మండలాలుంటే 568 మండలాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. 49 సెంటీగ్రేడ్లు నమోదయ్యే ఛాన్స్75 శాతం ఉందని, 47 డిగ్రీల వరకు వడగాల్పులు వీచే అవకాశం 100 శాతం ఉందని నివేదికల్లో సూచించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ప్లానింగ్ సొసైటీ, యూనిసెఫ్, తెలంగాణ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ నివేదికను సిద్ధం చేశాయి.
దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలతో సహా మొత్తం ఉమ్మడి ఐదు జిల్లాల పరిధిలో ఈ ఏడాది కరువు ఉంటుందని, ఎక్సెస్ వర్షపాతం నమోదైనా కరువు ప్రభావం ఉంటుందని వెల్లడించారు. నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్జిల్లాల్లో కరువు ఉంటుందని వివరించారు. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోనున్నట్లు హెచ్చరించారు. వానాకాలంలో 4 నెలల పాటు వర్షపాతం ఉన్నా.. ఇప్పుడు పొడి వాతావరణం, వేడి ప్రభావంతో జలాలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా వ్యవసాయ పంటలకు చాలా ప్రమాదమని వెల్లడించారు.
మంగళవారం 38.8 నుంచి 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 42.8 డిగ్రీలుగా రికార్డయింది. రాష్ట్రంలో ఉత్తర దిశనుంచి అతి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, మే నెలలో 47 నుంచి 49 డిగ్రీలకు చేరుతుందని హీట్వేవ్ రిపోర్టులో హెచ్చరించారు. ఖమ్మం, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, వడదెబ్బ మరణాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Mar 31, 2021 05:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

