AP Local Body Elections 2020: జనసేన పార్టీకి ప్రత్యేకంగా గుర్తు, పంతొమ్మిది రాజకీయ పార్టీలకే గుర్తులు, స్థానిక ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌
ap-election-commission-gazette-notification-allocation-election-symbol-local-body elections (photo-Twitter)

Amaravathi, Mar 09: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి (AP local Body Elections 2020) మొదలైంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తోంది. నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు (AP Local Body Election Nomination) స్వీకరించనున్నారు. అయితే అభ్యర్థులు 19 రాజకీయ పార్టీల గుర్తుల నుంచే పోటీ చేయాల్సి ఉంటుంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు నేటి నుంచే

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ పార్టీల తరుఫున పోటీ చేసే వారికి గుర్తుల కేటాయింపుపై (Election Symbol) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (AP Election Commission) నోటిఫికేషన్‌ జారీ చేసింది. 19 రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే వారికి ఆయా రాజకీయ పార్టీల గుర్తులు కేటాయించనున్నట్టు ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీలతో పాటు రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం, ఇతర రాష్ట్రాలకు చెందిన టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే, ఫార్వర్డ్‌బ్లాక్, ఎంఐఎం, ఐయూఎంఎల్, జనతాదళ్‌–ఎస్, జనతాదళ్‌–యూ, సమాజ్‌వాదీ పార్టీ (మర్రిచెట్టు గుర్తు), ఆర్‌ఎల్‌డీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఉన్నాయి. ఈ పార్టీల తరఫున పోటీ చేసే వారికి ఆయా పార్టీల గుర్తులు కేటాయిస్తారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఇక రిజస్టర్డ్‌ పార్టీలలో జనసేన పార్టీకి ప్రత్యేకంగా గుర్తును రిజర్వు చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద మరో 89 రాజకీయ పార్టీలు రిజిస్టర్‌ చేసుకున్నా వాటికి గుర్తులు కేటాయించలేదు.

ఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్

అలాగే స్వతంత్ర అభ్యర్ధులుగా, గుర్తు కేటాయించని రిజిస్టర్‌ పార్టీల తరుఫున పోటీ చేసే వారి కోసం 60 గుర్తులను గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ఉదహరించారు. ఈసారి స్థానిక ఎన్నికల బ్యాలెట్‌ పేపరులో ‘నోటా’ ఆప్సన్ కూడా ఇచ్చారు.