Skill Development Scam: తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు, ఏసీబీ కోర్టులో స్వయంగా వాదించిన చంద్రబాబు, కొనసాగుతున్న ఇరుపక్షాల వాదనలు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి విదితమే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి.
Vjy, Sep 10: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి విదితమే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి.బాబును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. కోర్టు హాల్లో ఇరువైపుల నుంచి 15 మందికే న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. 409 సెక్షన్పై వాదనలు కొనసాగుతున్నాయి.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించారు. వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా, అందుకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన అరెస్ట్ అక్రమమని, రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారని వాదించారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. 2015-16 బడ్జెట్లోనే స్కిల్ డెవలప్మెంట్ను చేర్చామని, అసెంబ్లీ కూడా అందుకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపును క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని అన్నారు. 9 డిసెంబర్ 2021 నాటి ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని, అప్పటి రిమాండ్ రిపోర్టులోనూ సీఐడీ తన పేరును ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తన వాదనలు వినిపించారు.
Pawan Kalyan Arrest: పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్
సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదిస్తుండగా.. చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడంపై సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన ఆధారాలు ఉంటే తప్ప ఈ సెక్షన్ వర్తించదని కోర్టుకు వివరించారు. 409 సెక్షన్ ను తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ బాబు తరఫున న్యాయవాది నోటీస్ ఇచ్చారు. అరెస్ట్ చేసిన వారిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలన్న నిబంధనను సీఐడీ ఉల్లంఘించిందని చంద్రబాబు తరఫున లాయర్ లూథ్రా పేర్కొన్నారు.
సీఐడీ తరఫున న్యాయవాది ఏఏజీ పి.సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ 24 గంటల్లోపు చంద్రబాబును కోర్టు హాజరుపర్చామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు అరెస్ట్ అయ్యారు. 2015లో విడుదలైన జీవో నెం.4తోనే కుట్ర మొదలైందని ఏఏజీ అన్నారు.
వీడియో ఇదిగో, సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్న టీడీపీ కార్యకర్తలు
కేసు విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును తాజాగా చేర్చడంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీ, ఏఏజీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ కేసుకు సంబంధించి గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును ఎందుకు చేర్చలేదని అడిగారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన పేరును చేర్చడానికి కారణాలేంటని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉందనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయా అని ఏఏజీని విచారించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి జవాబిచ్చారు. వాదోపవాదాలు కొనసాగుతుండగా.. న్యాయమూర్తి కాసేపు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత ఏఏజీ తన వాదనలు కొనసాగిస్తున్నారు. అనంతరం చంద్రబాబు న్యాయవాది లూథ్రా తన వాదనలు వినిపించనున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
శనివారం తెల్లవారుజామున అరెస్టయిన బాబు ప్రస్తుతం విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఉన్నారు. రిమాండ్ను తిరస్కరించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తుండగా, ఆయనను 15 రోజులపాటు కస్టడీకి అనుమతించాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఇరు పక్షాల మధ్య హోరాహోరీ వాదనలు కొనసాగుతున్నాయి.
2018లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన సీఐడీ.. చంద్రబాబు పాత్రపై ఆధారాలు సేకరించింది. రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించించిన సీఐడీ.. స్కిల్ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని పేర్కొంది. బాబుపై నేరపూరిత కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయి. నిన్న ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశాం. స్కిల్ స్కాంలో రూ.550 కోట్ల కుంభకోణం జరిగింది. ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్ ద్వారా దారి మళ్లించారని సీఐడీ తెలిపింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) అయిన నారా చంద్రబాబును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం నంద్యాలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో సీఐడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు పేర్లను కూడా చేర్చింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా లోకేశ్కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఆరోపించింది.
జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్కు ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయించి.. అందులో రూ.241 కోట్లను ముడుపుల రూపంలో తీసుకున్నారని సీఐడీ ఆరోపిస్తోంది.
(The above story first appeared on LatestLY on Sep 10, 2023 11:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

