YCP Ministers vs Pawan: నువ్వొక బోడి నాయుడివి, పకీర్ సాబ్వి, బోడి లింగం కాబట్టే రెండు చోట్ల తొక్కి పడేశారు, పవన్ కళ్యాణ్ శతకోటి లింగాల్లో బోడి లింగం వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన వైసీపీ మంత్రులు
గుడివాడ, మచిలీపట్నంలలో సోమవారం పర్యటించిన పవన్... మంత్రి కొడాలి నానిపై పంచ్ డైలాగులతో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు కౌంటర్ (YCP Ministers Counter to Pawan Kalyan) విసిరారు.
Amaravati, Dec 29: గుడివాడ, మచిలీపట్నంలలో సోమవారం పర్యటించిన పవన్... మంత్రి కొడాలి నానిపై పంచ్ డైలాగులతో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు కౌంటర్ (YCP Ministers Counter to Pawan Kalyan) విసిరారు. నాని అంటే ఎవరో తెలియదన్న పవన్ వ్యాఖ్యలకు పేర్ని స్పందిస్తూ ఇంతకీ ఆయన ఎవరు..? అంటూ ప్రశ్నిస్తూ.. మెడపై మట్టి నలుపుకుంటూ ఉంటాడు ఆయనేనా పవన్ అంటే.. అని వ్యాఖ్యానించారు.
సహస్రకోటి నాయుడుల్లో నువ్వొక బోడి నాయుడివి. ఇంతకీ ఈయన ఎప్పుడు వకీల్ అయ్యాడు..? ఏ యూనివర్శిటీలో వకీల్ చదివాడు..?. జనం పవన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. పవన్ది అంతా సెట్టింగ్లు, ప్యాకప్లు వ్యవహారమే’ అంటూ మంత్రి (Perni Nani) వ్యాఖ్యానించారు.
పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు : కొడాలి నాని పేరు ఎత్తాలంటే నీకు (పవన్) భయం. అందుకే గుడివాడలో కొడాలి పేరెత్తాడా..?.. లేదు. ఎవరో ఎమ్మెల్యేనో, ఎవరో మంత్రో నీకు తెలియదు..?. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలియకుండా రాజకీయం చేస్తున్నాడు. షూటింగ్లు లేకపోతేనే పవన్కు జనం గుర్తుకొస్తారు. పవన్ను (Janasena Chief Pawan Kalyan) నమ్ముకున్న తుళ్లూరు రైతులు నట్టేట మునిగిపోయారు. చంద్రబాబుకు తప్ప పవన్ ఎవరికైనా అండగా నిలబడ్డాడా..?. ఇంతకీ సినిమాలు మానేయమని చిడతల నాయుడికి ఎవరు చెప్పారు..?
వందల కోట్ల సంపాదన వదులుకుని వస్తున్నానని చెప్పింది చిడతల నాయుడు కాదా..?. ఏడాదికొకరికి చిడతలు వాయించేది పవనే. పవన్ ఆటలో అరటిపండు. మా ఇంటికొస్తే పచ్చడి అన్నమే.. చంద్రబాబు ఇంటికెళ్తే సూట్ కేసు’ అంటూ పవన్పై పేర్ని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నేను ఏది చేసినా వైఎస్ కుటుంబానికే చేస్తా. నాది స్వామి భక్తి.. చచ్చిపోతూ కూడా వైఎస్కే భజన చేస్తా. డబ్బుల కోసం చిడతలు కొట్టేవాడ్ని కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్: సినిమాల్లోనే పవన్ కల్యాణ్ వకిల్ సాబ్ అని.. బయట మాత్రం పకీర్ సాబ్’ అంటూ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పవన్ పర్యటన సినిమా ప్రమోషన్లా ఉందంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుపోయిన వ్యక్తి పవన్ అని మంపడ్డారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. అసెంబ్లీ ముట్టడిస్తామన్న పవన్కు.. అసెంబ్లీ ఎక్కడుందో తెలుసా అని ప్రశ్నించారు. పవన్ సినిమాల్లో పేమెంట్ తీసుకుని ఎలా నటిస్తున్నారో..రాజకీయాల్లో కూడా అలానే నటిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ మంత్రి కొడాలి నాని : జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవనే పెద్ద బోడి లింగమంటూ విరుచుకుపడ్డారు. తామంతా శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు. ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్లను ప్రజలు నమ్మరన్నారు.
ప్రజల తిరస్కారానికి గురైన పవన్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. పవన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టమన్నారు. గజదొంగ లాంటి చంద్రబాబు, బోడి లింగం లాంటి పవన్ కల్యాణ్లు ఎంతమంది వచ్చినా, దేవుడు ఆశీస్సులు ఉన్నంత కాలం జగన్ బొచ్చు కూడా పీకలేరంటూ కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం నడి బొడ్డున విజయవాడ, గుంటూరు, భీమవరం, గుడివాడ ప్రాంతాలలో పెద్ద పేకాట క్లబ్లు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు, అయన పార్టనర్ పవన్ కల్యాణ్ది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో పేకాట క్లబ్లు పెట్టమా.. లేక మూసివేశామో రాష్ట్ర ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పేకట క్లబ్లు పెట్టినప్పుడు ఆయన పార్టనర్ ఎక్కడ వున్నాడు. ఎవరో ఇచ్చిన ప్యాకేజిలు తీసుకుని నోటి కోచ్చినట్లు మాట్లాడితే మంచిది కాదు. మేము కాదు నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది’ అంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.
గతంలో పవన్ కల్యాణే జగన్మోహన్రెడ్డి బాగా పరిపాలిస్తే రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకుంటాను అని అన్నాడు. నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేందుకు.. చేసుకోకపోతే మాకేందుకు. నిన్ను సినిమాలు మానేయ్యమని మేము అడగలేదు కదా. మేము ఇప్పుటికి నిన్ను ఒక సినిమా యాక్టర్గానే చూస్తున్నాం. నువ్వు సినిమాలు వదులుతావా లేక ఇంకా ఎవరినైనా వదులుతావా అని మేం అడగలేదు. ఏం వదలాలి అనేది నీ ఇష్టం. ప్యాకేజీ వచ్చినట్లు ఉంది.. బయటకు వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని ఒక వైపు.. సొంత పుత్రుడుని ఓ వైపు జిల్లాలోకి నిన్న పంపించాడు. జోగిజోగి రాసుకుంటే బుడిద వస్తుంది అంటారు. అదే వచ్చింది’ అంటూ నాని ఎద్దేవా చేశారు.
‘ఏ మతమైన మాకు గౌరవం. పవన్ కల్యాణ్ ముక్కోటి లింగాలలో బోడి లింగం అని అంటున్నాడు. శివ లింగాలని బోడి లింగంగా సంబోధించడం ఆయన సంస్కారినికి అద్దం పడుతుంది. రాజకీయ పార్టీలు పెట్టి వ్యాపారం చేసుకుని డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన వ్యక్తులు వాళ్ళు. ఇలాంటి రాజకీయ పార్టీలు చాలా వచ్చాయి.. కాలగర్భంలో కలిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ప్యాకేజీ తీసుకుని ఇప్పుడు బయటకు వచ్చి వకిల్ సాబ్ చెప్పాడు అని చెప్పామంటున్నావ్. నిన్ను నువ్వు వకీల్ సాబ్ అని అనుకుంటుంటే జనం మాత్రం షకీలా సాబ్గా భావిస్తున్నారని తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో పార్టీలు పెట్టి రెండు చోట్ల ఓడిపోయిన అధ్యక్షులు ప్యాకేజీకి మాత్రమే పనికి వస్తారు’ అంటూ నాని మండి పడ్డారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ : మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas) డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు పవన్ జాగ్రత్తగా మాట్లాడాలి. మంత్రుల పట్ల సంస్కారం లేకుండా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆరు నెలలకు ఒకసారి పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వస్తున్నారు.
రైతులపై పవన్ కల్యాణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. నెల రోజుల వ్యవవదిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివర్ తుపాన్ పంట నష్ట పరిహారం అందించారు. టీడీపీ హయాంలో తుపాన్ పంట నష్ట పరిహారం రావాలంటే రెండేళ్లు పట్టేది’ అన్నారు. ‘చంద్రబాబు సొంత పుత్రుడు, దత్త పుత్రుడు ఇద్దరు రైతులపై కపట ప్రేమ కురిపిస్తున్నారు. సినిమా షూటింగ్ లేదు కాబట్టి పవన్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. లోకేష్ టైం పాస్కు వచ్చినట్లు రాష్ట్రానికి వస్తున్నారు. వకీల్ సబ్ సినిమా ప్రమోషన్ కోసం పవన్ రాష్ట్రానికి వచ్చినట్లు ఉంది’ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
మంత్రి ఆదిమూలపు సురేష్: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా జనసేనానిపై మండిపడ్డారు. ‘రాజకీయం అంటే సినిమా సెట్టింగ్, షూటింగ్ కాదు. సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయి.. సినిమాలు చేయాలనుకుంటే సినిమాలే చేసుకోండి. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు..మా నాయకుడిలా పాదయాత్ర చేయండి. 14 నెలలు పాదయాత్ర చేయాలంటే సినిమా కాదు. ఏ పార్టీకి సపోర్టు చేస్తాడో ఆయనకే తెలియదు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేక పోయారు’ అంటూ సురేష్ ఎద్దేవా చేశారు.
మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి: పవన్ వ్యాఖ్యలపై మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రుణమాఫీపై ఎలా స్పందించారో చెప్పాలని పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. కోవిడ్ టైంలో పవన్ ఎక్కడికెళ్లారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ముట్టడిస్తామన్న పవన్ కల్యాణ్ మాటలను ఎవరూ విశ్వసించరని గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో పొందుపరచని అంశాలని సైతం సీఎం జగన్ నెరవేరుస్తున్నారని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు.
కాగా గుడివాడ జంక్షన్లో నానిని ఉద్దేశించి జనసేన అధినేత మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే.. ఒక్కొక్కరూ బూతులు తిడుతుంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి? నానియా? వైసీపీలో నానీలు ఎక్కువమంది. ఏదో ఒక నాని. ఏ నానో నాకు అర్థం కావడం లేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం’’ అన్న కామెంట్ చేశారు. పవన్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నోరు తెరిస్తే ప్రత్యర్థులపై ఇష్టారీతిన విరుచుకుపడే కొడాలి నానిపై పవన్ నేరుగా విమర్శలు చేయడంతో అందరి దృష్టి వీరిపై పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ కొడాలి తనదైన శైలిలో పవన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
(The above story first appeared on LatestLY on Dec 29, 2020 05:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

