Suryapet Coronavirus: ఒక్కరి నుంచి 80 మందికి కరోనా, డేంజర్ జోన్‌లో సూర్యాపేట, లాక్‌డౌన్ కఠినంగా అమలు, తెలంగాణలో 928కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య
COVID-19 Outbreak in India. | PTI Photo

Hyderabad, April 22: సూర్యాపేటలో ఓ వ్యక్తి నుంచి 80 మందికి కరోనావైరస్ (Suryapet Corona Pandemic) సోకింది. మర్కజ్‌ లింక్‌ల పరంపరలో ఆ వ్యక్తి నుంచి దాదాపు 80 మందికి కోవిడ్ 19 వైరస్ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. సూర్యాపేటలో (Suryapet) ఏప్రిల్‌ 10 వరకు జిల్లాలో 20 కేసులు నమోదు కాగా ఇందులో 19 కేసులు (COVID-19 cases) తొలి బాధితుడి నుంచి వ్యాపించినవే. ఇప్పటివరకు నమోదైన 80 కేసుల్లో 79 కేసులు ఒక్కరి నుంచే వ్యాపించినవేనని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో 928కు చేరిన కోవిడ్-19 కేసులు, ఈరోజు కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదు

అయితే ఏ ఒక్కరిలో కూడా కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో వైర స్‌సోకిన ఆనవాళ్లు లేకుండానే ఇతరులకు అంటించినట్లుగా తెలుస్తున్నది.మంగళవారం 26 కేసులు నమోదైన నేపథ్యంలో వాళ్ల ప్రైమరీ కాంటాక్ట్‌లను కూడా గుర్తించి వందల మంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు. అనుమానం ఉన్న అందరినీ ప్రభుత్వ క్వారంటైన్‌తోపాటు హోంక్వారంటైన్‌లో ఉంచారు.  మే 7 వరకు ఎక్కడి వాళ్లు అక్కడే, ఎవరూ తెలంగాణలోకి అడుగుపెట్టవద్దు- సీఎం కేసీఆర్

సూర్యాపేట జిల్లాలో 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదుతో అవడంతో పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లతో మూసివేశారు. దీంతో సూర్యాపేట వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ ప్రాంతాలు, గ్రామాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు.  తెలంగాణకు కొత్త జడ్జీ, నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

ఆదివారం నాటికి జిల్లా వ్యాప్తంగా 54 కేసులుండగా సోమ, మంగళవారాల్లో కలిపి 26 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఇవన్నీ కూడా సూర్యాపేటలోని కూరగాయల మార్కెట్‌ నుంచే వ్యాప్తి చెందాయని అధికారులు భావిస్తున్నారు. తొలుత పాజిటివ్‌ సోకిన అపోలో ఫార్మసిస్టుకు కరోనా నయం కావడంతో అతడిని హైదరాబాద్‌ గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జిచేశారని కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 688 మంది నుంచి రక్త నమూనాలు తీసి పంపింగా 608 నెగెటివ్‌ రాగా 80 మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. మంగళవారం మరో 191 శాంపిళ్లను పరీక్షకోసం పంపించారు.

తెలంగాణ లాక్‌డౌన్‌, ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకోమంటున్న పోలీసు శాఖ

జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలకు విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా మొత్తం జల్లెడ పట్టి కేసులు లేకుండా చేయాలని పేర్కొన్నారు. కరోనా కేసుల సంఖ్య జిల్లాలో పెరిగిందన్న సమాచారంతో మంత్రి మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌ భాస్కరన్‌తో సమీక్షించారు. కరోనా కట్టడి చర్యలపై చర్చించారు.

జ్వరం, దగ్గు, జలుబు మందులు కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉన్నతాధికారులు సూర్యాపేటలో ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు సూర్యాపేటలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కరోనా తీవ్రతపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలకు కేసీఆర్ ప్రత్యేక అధికారులను నియమించారు. దీనిలో భాగంగానే సూర్యాపేట జిల్లాకు సర్పరాజ్ అహ్మద్‌ను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది.

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి

సూర్యానేట జిల్లాలో డీఎంహెచ్‌వోగా డాక్టర్ డి.సాంబశివరావు నియమితులయ్యారు. ప్రస్తుతం డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నిరంజన్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆపై డాక్టర్ డి.సాంబశివరావును డీఎంహెచ్‌వోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ డి.సాంబశివరావు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాధి రహిత జిల్లాగా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో తెలంగాణ (Telangana) సరిహద్దుల్లో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చేవారిని తెలంగాణలోకి అనుమతించడంలేదు. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండడంతో తెలంగాణ సరిహద్దుల్లో పోలీస్ యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలకు వచ్చే మహరాష్ట్ర రహదారులన్నీ మూసివేశారు. ప్రాణహిత, పెనుగంగ, పర్యాటక ప్రాంతాలన్నీ మొత్తం మూసివేశారు. ఆ మార్గంలో అన్ని చెక్‌పోస్టులను మూసివేశారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమై పర్యవేక్షిస్తున్నారు. అలాగే మహారాష్ట్ర పోలీసులు కూడా తెలంగాణ నుంచి రాకపోకలను నిషేధించారు.

రాష్ట్రంలో మంగళవారం 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ నెగెటివ్‌ రావడంతో ఎనిమిదిమంది డిశ్చార్జి అయినట్టు ప్రజారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 26 మందికి పాజిటివ్‌ వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 19, నిజామాబాద్‌-3, గద్వాల-2, ఆదిలాబాద్‌-2 కేసులు నమోదుకాగా.. ఖమ్మం, మేడ్చల్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 928కి చేరింది. ఇప్పటివరకు 23 మంది మృతి చెందగా.. 194 మంది డిశ్చార్జి అయ్యారు. 711 మందికి చికిత్స అందిస్తున్నట్టు ప్రజారోగ్యశాఖ తెలిపింది.