MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక మలుపు, కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసిన తెలంగాణ హైకోర్టు, సిట్‌ విచారణ నిలిపివేయాలంటూ ఆదేశాలు
High Court of Telangana | (Photo-ANI)

Hyd, Dec 26: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (MLAs Poaching case)..తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐ విచారణకు అనుమతిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. మిగిలిన పిటిషన్లకు మాత్రం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. సిట్‌ విచారణ సరిగా జరగట్లేదన్న వాదనతో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఏకీభవించింది.

సిట్‌ ఏర్పాటును కొట్టేస్తూనే సిట్‌ విచారణ నిలిపివేతకు ఆదేశించింది. అలాగే.. కేసును సిట్‌ నుంచి సీబీఐకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు వివరాలు సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది హైకోర్టు బెంచ్‌. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని సిట్‌ యోచిస్తోంది.

మరోవైపు కేసును (TRS MLAs poaching case) సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.

మలుపులు తిరుగుతున్న ఎమ్మెల్యేల ఎర కేసు, సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఈడీ విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్యే లేఖ

బీజేపీ తరఫున వాదించిన రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. సిట్‌ దర్యాప్తు సరిగా జరగలేదని ఆరోపించారు. కేసులో సాంకేతిక అంశాలను పట్టించుకోలేదన్నారు. ‘‘ రాజకీయంగా వేధిస్తున్నారని కోర్టుకు వివరించాం. సంబంధం లేకున్నా. బీజేపీ పేరు ప్రస్తావించారు. రాజకీయ దురుద్దేశాలతోనే కేసు పెట్టారు. సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శలు చేశారు. సిట్‌కు విచారణ అధికారం లేదు.’’ అని తెలిపారు.

ఎమ్మెల్యేలకు ఎరకేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సింహయాజీ, రామచంద్రభారతి, నందకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును తెలంగాణ ప్రభుత్వం సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో 5గురికి నోటీసులు, విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన సిట్

అయితే, సిట్‌ దర్యాప్తుపై నమ్మకం లేదంటూ బీజేపీ, నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, వాంగ్మూలాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సైతం హైకోర్టు రద్దు చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థ‌(సిట్‌)ను కాద‌ని సీబీఐకి బ‌దిలీ చేయ‌డం స‌రికాదని తాండూరు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం సాయంత్రం రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ చేసిన విచార‌ణ‌లో ఏమి దొర‌క‌లేదు కాబ‌ట్టే సీబీఐని రంగంలోని దించుతున్నార‌ని భావిస్తున్నాన‌ని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. త‌మ‌కు న్యాయ వ్య‌వ‌స్థ‌పై పూర్తి విశ్వాసం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. హైకోర్టు ఆర్డ‌ర్ కాపీ వ‌చ్చిన త‌ర్వాత‌.. దాన్ని ఆధారం చేసుకుని అప్పీల్‌కు వెళ్లాలా? సుప్రీంకోర్టుకు వెళ్లాలా? అన్న‌ది నిర్ణ‌యిస్తాం అని తెలిపారు.

సీబీఐ, ఈడీ, ఐటీ కేంద్రం చేతిలో అస్త్రాలుగా మారాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆర్ద‌ర్ కాపీ వ‌చ్చిన త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. సిట్‌ను కాద‌ని సీబీఐకి బ‌దిలీ చేయ‌డం స‌రికాద‌న్నారు. దేశంలో ఏం జ‌రుగుతుందో తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని సూచించారు. దొంగ స్వాముల‌తో సంబంధం లేదంటూనే బీజేపీ వారిని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు.

బీఎస్ సంతోష్ దొంగ ప‌ని చేయ‌క‌పోతే విచార‌ణ‌కు ఎందుకు రావడం లేద‌ని ప్ర‌శ్నించారు. ఈ కేసు ఈడీ ప‌రిధిలోకి రాక‌పోయినా విచార‌ణ‌కు పిలిచారు. ఈడీ విచార‌ణ‌పై హైకోర్టులో రిట్ దాఖ‌లు చేశాన‌ని తెలిపారు. బీజేపీ నేత‌లు, దొంగ‌స్వాములు చెప్పిందే జ‌రుగుతోంద‌న్నారు. కోర్టుల‌ను బీజేపీ నాయ‌కులు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. న్యాయం త‌మ వైపు ఉంద‌న్నారు. న్యాయ వ్య‌వ‌స్థ ఏ తీర్పు ఇచ్చినా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని రోహిత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.