COVID-19 in Telangana: తెలంగాణలో కరోనా కాటుకి 18 మంది మృతి, కొత్తగా 52 కేసులు నమోదు, 644కు చేరిన కోవిడ్ 19 సంఖ్య, 25 జిల్లాల్లో 221 కంటైన్మెంట్‌ ప్రాంతాలు ఏర్పాటు
Coronavirus Cases in India (Photo-PTI)

Hyderabad, April 15: తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా మరో 52 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య (Coronavirus cases in Telangana) 644కు చేరింది. ఈ మహమ్మారి వ్యాధి కారణంగా మరొకరు మరణించడంతో మృతుల సంఖ్య (Coronavirus Deaths) 18కి చేరింది. కరోనా పాజిటివ్‌ రోగుల్లో ఇప్పటికి 110 మంది కోలుకొని డిశ్చార్చి అయ్యారు. ఇంకా 516 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు మంగళవారం రాత్రి బులెటిన్‌ విడుదల చేశారు.

డాక్టర్‌పై కరోనా పేషెంట్ బంధువుల దాడి, తెలంగాణ ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం

మొత్తం 28 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత నిజామాబాద్, వికారాబాద్‌ జిల్లాలున్నాయి. సోమవారం 61 కేసులు నమోదు కాగా, మంగళవారం 52 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో వైరస్‌ వ్యాప్తిలో వేగం తగ్గలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో మర్కజ్‌కు సంబంధించినవే ఎక్కువగా ఉండటం గమనార్హం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

కాగా ప్రభుత్వం విధించిన ఆంక్షలను పట్టించుకోకపోవడం వల్లనే రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారి కుటుంబసభ్యులు, వారిని కాంటాక్ట్‌ అయిన వారందరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాజిటివ్‌ కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ వ్యక్తులకు తప్పనిసరిగా పరీక్షలు చేయాలని నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు అన్నీ బంద్

సోమవారం పాజిటివ్‌గా తేలిన 61మందితో దాదాపు 900 మంది కాంటాక్ట్‌ అయినట్టు అధికారులు గుర్తించారు. వారందరికీ పరీక్షలు చేయడంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. వీరిలో లక్షణాలున్నా లేకున్నా పరీక్ష చేయడం ద్వారా ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా కట్టడిచేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.

 మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా అనుమానితులను పరీక్షించేందుకు మరో రెండు కేంద్రాలను గుర్తించారు. ఇప్పటికే ఆరు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ, సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ డయాగ్నస్టిక్స్‌కు కూడా అనుమతినిచ్చింది.

ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

రాష్ట్రంలో 28 జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి చెందగా, 25 జిల్లాల్లో 221 కంటైన్మెంట్‌ ప్రాంతాలను సర్కారు ఏర్పాటు చేసింది. ఇందులో 3.01 లక్షల ఇళ్లకు వెళ్లి వైద్యాధికారులు సర్వే చేశారు. మొత్తం 12.04 లక్షల మంది వివరాలు నేరుగా సేకరించారు. కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఏవైనా ఉన్నాయా.. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేస్తున్నట్లు బులెటిన్‌ లో పేర్కొన్నారు.

ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు

ఒకే కుటుంబంలో 18 మందికి వైరస్‌

పాతబస్తీ తలాబ్‌కట్టా ఆమన్‌నగర్‌–బిలో ఒకే ఇంట్లో 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 10న ఈ ప్రాంతానికి చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కుటుంబసభ్యులను పరీక్షించగా.. 17 మందికి కూడా వైరస్‌ సోకిందని నిర్ధారించారు. వీరందరినీ వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరితో పాటు మరో 24 మంది బంధువులకు పరీక్షలు నిర్వహించగా, వారికి నెగెటివ్‌ వచ్చింది.